భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్ 30 శాతం వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కార్మికుల డిమాండ్పై నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సమ్మె ప్రకటించడంతో సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
షూటింగ్స్ నిలిచిపోడంతో ఈ క్రమంలోనే నిర్మాతల మండలి సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చిరుతో చర్చించారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, మైత్రీ రవి, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, కె.ఎల్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. అర్ధాంతరంగా షూటింగ్స్ నిలిపివేయడంపై చిరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అయితే కార్మికుల సమస్యలు.. వారి అభిప్రాయాలను తెలుసుకుంటానని చిరు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై రేపు క్లారిటీ రానుంది. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు కూడా చర్చలు జరుపుతున్నారు. కాగా సినీ నిర్మాతలు, కార్మికులు మధ్య వివాదం ఎలా పరిష్కారం అవుతుందని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.