భారత్ సమాచార్, జాతీయం ;
కర్ణాటక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మైసూర్ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సీఎంను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా కేసులో చేర్చారు.
మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ఇటీవల ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వటాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలు చట్ట ప్రకారం ఉన్నాయని కోర్టు వెల్లడించింది.