భారత్ సమాచార్.నెట్: బంగారం ధర (Gold Rate) రికార్డు క్రియేట్ చేసింది. పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరడంతో.. బులియన్ మార్కెట్లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా లక్ష రూపాయల మార్కును దాటింది. దీనిపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (Goods and Services Tax) కలిపితే మొత్తం ధర రూ.1,02,116కి చేరుకుంది. ధర ఇంతాల పెరగడం చరిత్రలో ఇదే తొలిసారి. అమెరికా, చైనా (America-China) మధ్య ట్రేడ్ వార్ (TradeWar) జరగడం.. డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.
మంగళవారం దేశీయంగా 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన ఒక గ్రాము బంగారం ధర రూ.10,000 పైనే పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధరల పెరుగుదలకు అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు వెండి ధరలు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా కిలో ధర రూ. లక్షకు చేరువవుతోంది. గతంలో ఓసారి లక్ష మార్కును దాటిన కిలో వెండి ధర.. ప్రస్తుతం రూ.99,299గా ఉంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో కూడా 10 గ్రాముల బంగారం ధర మొదటిసారి రూ.96 వేల మార్కు దాటింది. ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదని అంతర్జాతీయ నిపులణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో బంగారం విలువ మరింత పెరిగే అవకాశముంది.