భారత్ సమాచార్, కేరళ ;
దేశ నలుమూలల నుంచి కూడా శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి సంవత్సరం మాల ధరించి స్వామి వారి దర్శనం కోసం కేరళకు వస్తుంటారు. వేల సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని ఎంత నియంత్రించిన కొన్ని సార్లు అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా ట్రావెన్ కోర్ దేవస్థానం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా భక్తుల కోసం ఈ ఏడాది నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది.
అయ్యప్పస్వామి దర్శనం కోసం ఇక నుంచి రోజుకు 50 వేల మంది భక్తులను వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా అనుమతించాలని తాజాగా దేవస్థాన బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తులకు ఇన్సూరెన్స్ ను కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. రోజూ 80 వేలమందిని దర్శనానికి అనుమతించాలని సాధ్యా సాధ్యాలను పరిశీలించి.. కొన్ని పరిమితుల కారణంగా భక్తుల సంఖ్యను రోజుకి 50 వేలకు కుదించారు. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఆలయ బోర్డు అధికారులు ప్రకటించారు.
దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ సదుపాయం గతంలో పదిరోజుల ముందు వరకూ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. అలాగే వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీ కూడా అందించనున్నారు. ఇందుకోసం బుకింగ్ సమయంలోనే వారివద్ద నుంచి రూ.10 రూపాయలు రుసుమును వసూలు చేయనున్నారు. యాత్ర సమయంలో అనుకోని పరిస్థితులు తలెత్తితే బీమా అందించేందుకు ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువచ్చినట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. అలాగే ఇన్సూరెన్స్ కవరేజీని పెంచేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలతో మరిన్ని చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
స్వామి వారి దర్శనం కోసం వచ్చే మహిళలు, చిన్నారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా మాత్రమే దర్శనానికి పంపనున్నారు. అలాగే మహిళలు, దివ్యాంగుల కోసం అప్పం, అరవణ ప్రసాదం పంపిణీ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు, ప్రకటనల కోసం అరవణ ప్లాంట్ వద్ద ప్రత్యేక కౌంటింగ్ సెన్సార్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు అన్నదాన మండపం వద్ద కూపన్ల స్థానంలో పీవోఎస్ మెషీన్ల ద్వారా టోకెన్లు అందించనున్నారు. అలాగే డోలీ సేవల కోసం ప్రీపెయిడ్ రిజిస్ట్రేషన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి అయ్యప్ప భక్తులకు మెరుగైన, సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేసేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు.