భారత్ సమాచార్, అమరావతి ;
ఏపీలో నూతన మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలికింది. అక్టోబర్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం షాపులు ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని (New Liquor Policy In AP) ఖరారు చేసింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఇందుకు ఒక్కో దానికి రూ.2 లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చు. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11వ తేదీన లాటరీ తీసి లైసెన్స్లు అందజేస్తారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగియనుంది. అయితే కొత్త దుకాణాలు ఏర్పాటు అయ్యే వరకు వీటినే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోరూ. 85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి. రిటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్ ఉంటుంది.
నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్టోర్స్కు అప్గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు. ఇందుకు ఏడాదికి ఐదు లక్షలు చొప్పున అదనంగా లైసెన్సు రుసుము చెల్లించాలి. ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన విధివిధానాలు విడిగా ఖరారు చేయనున్నారు.గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెంచిన మద్యం ధరలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగ్గించింది. క్వార్టర్ రూ.99 లభించేలా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యంపై పది రకాల పన్నులు విధించగా,ఇప్పుడు ఆరుకు కుదించారు. కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయనున్నారు. దీని ద్వారా వచ్చే వంద కోట్లను గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపే చర్యలకు, వ్యసన విముక్తి, కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనున్నారు. గీత కార్మికులకు కేటాయించిన 340 దుకాణాలకు 2, 3రోజుల్లో విధి విధానాలు ఖరారు కానున్నాయి.
తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి వరకు బస్టాండు, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు. లీలామహల్-నందిసర్కిల్-అలిపిరి-ఎస్వీఆర్ఆర్ ఆసుపత్రి,-స్విమ్స్ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.