భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
ధ్వజం అంటే పతాకం…
ధ్వజ స్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం. భక్తితో గుడికి వెళ్లగానే దేవుడి కంటే ముందు కనిపించేది కూడా ధ్వజస్తంభమే. గర్భగుడిలో ప్రతిష్ఠించే దేవతా విగ్రహం వంటిదే ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం కూడా అని భక్తుల నమ్మకం. ధ్వజం అంటే పతాకం. ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ధ్వజస్తంభం ఉండే దైవక్షేత్రాన్ని మాత్రమే దేవాలయం అని అంటారు. దేవాలయాల్లో షోడశోపచార పూజలు జరగాలంటే ఈ ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాలనేది వేద పండితుల మాట. ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు. ఇప్పుడా అవసరం లేకపోయినా కార్తీకమాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజులను గౌరవిస్తున్నారు. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. గర్భగుడిలో ఉండే దైవానికి చేసే అనుష్ఠాన అర్చనల ప్రభావం వల్ల, ధ్వజస్తంభానికి కూడా శక్తి కలుగుతుంది. అందుకే మూలవిరాట్టును దర్శించుకోవడానికి ముందే దీనికి నమస్కార, ప్రదక్షిణలు చేయాలి.
మయూరధ్వజుడి ఆత్మస్వరూపంగా…
ద్వాపరయుగంలో మణిపుర రాజు మయూరధ్వజుడి త్యాగశీలాన్ని మెచ్చిన శ్రీకృష్ణుడు, అతని కోరిక మేరకు దైవసన్నిధిలో స్తంభమై కొలువుదీరమని వరాన్ని ప్రసాదించాడు. ఈ క్రమంలో మయూరధ్వజుడి ఆత్మస్వరూపంగా అదే పేరుతో ఆలయాల్లో ధ్వజస్తంభాన్ని విధిగా ఏర్పాటుచేసే సంప్రదాయం మొదలైందని జైమినీ భారతం చెపుతుంది. ఆలయంలో మూలమూర్తికి జరిగే దీపారాధనలు, నైవేద్యం తదితర ఉపచారాలన్నీ ధ్వజస్తంభానికి కూడా విధిగా చేస్తారు. తొలుత ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాతే ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలన్న నియమం ఉంది.
జీవధ్వజం అని మరో పేరు…
పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో దాచుతారు. దానిని ధాన్యాధివాసం అంటారు. అలా కొన్నాళ్లు గడిచాక తీసి నీళ్లలో దాచుతారు. దానిని జలాధివాసం అంటారు. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్షశాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ దారువు (చెక్క) ను కూడా నీళ్లలో, ధాన్యంలో ఉంచి ఆ తరువాత ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు ఉంది. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి.
మేఖల కింద సుదర్శన చక్రం…
ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి. ధ్వజస్తంభానికి కింద కూర్మయంత్రం వేయాలి. వైష్ణవాలయాలలో పైన పతాకంలాగ మూడువరసల్లో జెండా ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇలా మూడు బద్దలుగా ఉన్న భాగాన్ని మేఖల అంటారు. దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తుంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండచ్చు. చెక్కతో తయారుచేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాలో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. ఈ తొడుగును మేఖలకు కూడా వేస్తారు. మేఖల కింద సుదర్శన చక్రం (వైష్ణవాలయాలలో), నందీశ్వరుడు (శివాలయాలలో) ఉంటాయి.
పీఠానికి నాలుగు వైపులా దేవతల ప్రతిష్ఠ…
ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తర్వాత మళ్లీ కొత్త దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. గోపుర కలశం కంటె ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం, కలశంతో సమానంగా ఉంటే మధ్యమం, కలశం కంటె తక్కువ ఎత్తులో ఉంటే అధమం. ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు. పక్కనే బలిపీఠం పెడతారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం పూజ చేస్తారు.