భారత్ సమాచార్, ఏ ఐ న్యూస్ ;
ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ) యుగంలో సాధారణ చోరీల కంటే కూడా సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు కొత్త, కొత్త పథకాలతో బ్యాంకు బ్యాలెన్స్ ను కొల్లకొడుతున్నారు. అవగాహన లోపంతోనో, అనుకోకుండా వచ్చిన మెసేజ్ వలనో మన బ్యాంకు ఖాతా నుంచి నగదును సైబర్ మోసగాళ్లు దోచేస్తే ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్లతో చట్టవిరుద్ధంగా పాల్పడే చర్యలను ఆన్ లైన్ మోసాలు అంటారు. వీటిని చేయడం చట్టప్రకారం నేరం. ప్రస్తుత కాలంలో సైబర్ కేటుగాళ్లు క్రెడిట్ కార్డు, బ్యాంకు అకౌంట్ హ్యాకింగ్, ఫిషింగ్, విషింగ్ స్కామ్లకు పాల్పడి ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారు. ఇలా సైబర్ దాడికి గురైప్పుడు భారత ఐటీ చట్టం ప్రకారం, దేశంలోని ఏ సైబర్ సెల్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు.
మోసానికి గురైతే ఇలా చేయండి…
సైబర్ నేరగాళ్లు బ్యాంకింగ్, డెబిట్/ క్రెడిట్ కార్డు వివరాలను తస్కరించి మోసపూరిత లావాదేవీల ద్వారా డబ్బును కాజేస్తుంటారు. ఫిషింగ్ లింక్స్, హ్యాకింగ్ వంటి మార్గాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ ఈ తరహా బ్యాంకింగ్ మోసాల బారిన మీరు పడితే, పోలీసులకు ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ డెబిట్/ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంకుకు సమాచారం అందించాలి. బ్యాంకు కస్టమర్ కేర్ హెల్ఫ్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి మొదటగా అక్కడ ఫిర్యాదు చేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫిర్యాదు చేసే ముందు…
మీరు సైబర్ క్రైమ్ సెల్ కు ఫిర్యాదు చేసే ముందు, మీ వద్ద అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండేలా సరి చూసుకోవాల్సి ఉంటుంది. గత ఆరు నెలల మీ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఎస్ఎంఎస్లు, సైబర్ ఫ్రాడ్స్ మీకు పంపిన స్పామ్ లింకులు, లావాదేవీకి సంబంధించిన వివరాలు సిద్ధంగా ఉంచుకుని, ఆ తర్వాతే ఫిర్యాదు చేయటానికి ప్రయత్నించాలి. అలాగే వ్యక్తిగత ఐడీ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన అడ్రస్ ప్రూఫ్ ను కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఈ విధంగా తగు పత్రాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాటానికి సంప్రదించాలి.
ఆన్లైన్/ ఆఫ్లైన్ ఫిర్యాదు
ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైతే భారత ఐటీ చట్టం ప్రకారం, దేశంలోని ఏ సైబర్ క్రైమ్ సెల్ కు అయిన ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://cybercrime.gov.in/ వెబ్సైట్ ద్వారా కూడా తమ కంప్లైంట్ ను నమోదుచేయవచ్చు. 1930 నంబరుకు ఫోన్ చేసి ఆన్లైన్ మోసానికి సంబంధించిన ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ నంబరు పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఆన్లైన్ మోసానికి గురైనవారు దేశంలోని ఏ సైబర్ సెల్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. అందుకు మీకు వీలుకాకపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ ఫిర్యాదు ను అందించాల్సి ఉంటుంది. స్టేషన్ కి వెళ్లిన తర్వాత కచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేటట్లు చూసుకోవాలి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే, నగర కమిషనర్ లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ను వెంటనే సంప్రదించాలి.
ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి…
ఆన్లైన్ మోసానికి సంబంధించిన ఫిర్యాదు లెటర్ ను సైబర్ క్రైమ్ సెల్ హెడ్ కు పంపాల్సి ఉంటుంది. అందులో మీ పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను పొందుపర్చాలి. ఆన్లైన్ మోసానికి సంబంధించిన నిర్దిష్ట రుజువులను, పత్రాలను సమర్పించాలి. అవే మీ కేసుకు తగిన సాక్ష్యాధారాలుగా ఉపయోగపడతాయి.
72 గంటల్లోగా ఫిర్యాదు చేయాటం ఉత్తమం
కస్టమర్ లేదా బ్యాంక్ ప్రమేయం లేకుండా, మాల్వేర్ సైట్లు, పబ్లిక్ వైఫై, ఏటీఎం స్కామర్ల వంటి థర్డ్ పార్టీల కారణంగా ఆన్లైన్ మోసం జరిగితే 72 గంటల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే మీకు పరిహారం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే మీరు బ్యాంకు, సైబర్ క్రైమ్ సెల్ కు ఫిర్యాదు చేయడం తప్పనిసరి. మోసపోయిన తర్వాత ఆలస్యం చేస్తే ఫిర్యాదు దారుడు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.