భారత్ సమాచార్.నెట్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుజుకుంటోంది. ఇటీవల కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డు స్థలాలు వేలం వేయగా.. రికార్డు స్థాయిలో గజం రూ.298 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య స్థలం విక్రయానికి పెట్టగా రికార్డు ధర పలికింది. గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు స్థలాల వేలం పెట్టగా.. వేలంలో గజం భూమి ఏకంగా రూ.2.22 లక్షలు పలికి రికార్డు సృష్టించింది.
గచ్చిబౌలిలో మొత్తం 4 స్థలాలను వేలం వేయగా అవన్నీ అమ్ముడుపోయాయి. ముఖ్యంగా కుక్కలపార్క్కు ఆనుకుని ఉన్న 1,487 చదరపు గజాల స్థలం గజం రూ.1.20 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.2.22 లక్షలకుపైగా పెరిగింది. ఫలితంగా ఈ స్థలం రూ.33 కోట్లకు విక్రయించారు. ఈ వేలంలో మొత్తం 53 మంది పోటీదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి వంటి ఐటీ, వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువ ఉండడంతో రికార్డు స్థాయిలో ధరలు పలకడం.. రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త రెక్కలు వస్తున్నాయి.
మరోవైపు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం చింతల్లోని ఎంజీఐ 10 ప్లాట్లకుగాను 3 అమ్ముడుపోగా, రూ.8.11 కోట్ల ఆదాయం వచ్చింది. బాచుపల్లిలో 8 ప్లాట్లు వేలంలో పెట్టగా 4 ప్లాట్లు అమ్ముడుపోయాయి. వీటిలో బీ-1 బ్లాక్లోని ఎఫ్17 ప్లాటు అత్యధికంగా రూ.18.21 లక్షల ధర పలికింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వం మొత్తంగా రూ.65 కోట్ల ఆదాయం రాబట్టింది. ఇందులో గచ్చిబౌలిలోని స్థలాల ద్వారానే రూ.55.56 కోట్లు సమకూరినట్టు హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ తెలిపారు.