భారత్ సమాచార్.నెట్: మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ (Womens One day World Cup)కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) షెడ్యూల్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారతదేశం (India), శ్రీలంక (SriLanka) వేదికలలో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. మొత్తం టోర్నమెంట్కు ఆతిథ్య హక్కులు ఇండియాకే ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ పాల్గొనే మ్యాచులను నిర్వహించేందుకు శ్రీలంకను తటస్థ వేదికగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే మహిళల ప్రపంచ కప్లో భారత జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో తలపడనుంది. అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ తొలిసారిగా తలపడనున్నాయి. ఈ రెండు జట్లు అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ ఆడనుంది. ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఇది తొలి క్రికెట్ మ్యాచ్ కావడంతో ఈ పోరు కీలకంగా మారింది.
ఇక టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. 8 జట్లలో, 6 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన 2 జట్లు క్వాలిఫయర్స్ ద్వారా మహిళల ప్రపంచ కప్లో చోటు దక్కించుకున్నాయి. వరల్డ్ కప్ ఈవెంట్ ప్రారంభమయ్యే ముందు.. అన్ని జట్లు సెప్టెంబర్ 24 నుండి ప్రారంభమయ్యే రెండు వార్మప్ మ్యాచ్లను కూడా ఆడనున్నాయి. ఇండియా రెండు వార్మప్ మ్యాచ్లలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇకపోతే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్ ప్రతి జట్టు ఒకే రౌండ్లో ఇతర 7 జట్లతో ఒకసారి తలపడుతుంది. అప్పుడు మొదటి 4 జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.