భారత్ సమాచార్,దిల్లీ ;
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి పాలైన కూడా మెరుగైన ఫలితాలు సాధించామని సంబరాలు చేసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి హవా చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. ఇందులో ఇండియా కూటమి అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధిస్తే, అధికార ఎన్డీఏ పక్షం 2 చోట్ల మాత్రమే గెలవగలిగింది. ఒక స్థానాన్ని స్వత్రంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార పక్షం ఎన్డీయే, ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో వీటి ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా, మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది.
పశ్చిమ బెంగాల్ లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్ లోని మూడు, ఉత్తరాఖండ్ లోని రెండు, పంజాబ్, బిహార్, తమిళ నాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జులై 10 వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్పై 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే పశ్చిమబెంగాల్లోని మానిక్తలా, బాగ్దా, రాణా ఘాట్ దక్షిణ్, రాయ్గంజ్.. మొత్తం నాలుగు స్థానంలో టీఎంసీ అభ్యర్థులు విజయం నమోదు చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని రాష్ట్ర ముఖ్య మంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ 9 వేల మెజార్టీతో గెలుపొందారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగలౌర్ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం నమోదు చేశారు. తమిళనాడు లోని విక్రావండి స్థానం నుంచి డీఎంకే నేత అన్నియుర్ శివ అసెంబ్లీకి వెళ్లనున్నారు.
నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా, ఇదే రాష్ట్రంలోని హమీర్పుర్ లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మధ్యప్రదేశ్లోని అమర్వాడా స్థానంలో బీజేపీ నాయకుడు గెలుపొందారు. బిహార్లోని రూపౌలి స్థానం లో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ అనూహ్య విజయం నమోదు చేశారు.