భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack)తో భారత్(India), పాక్ (Pakistan) మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలోనే దాయాదికి మరో షాక్ ఇచ్చింది భారత్ ప్రభుత్వం. జాతీయ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్ నుంచి జరిగే అన్ని రకాల దిగుమతులను (Imports) తక్షణమే నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్థాన్ నుంచి నేరుగా గానీ లేదా పరోక్షంగా గానీ వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మేడిన్ పాకిస్థాన్ వస్తువులకు భారత్లో చోటులేదని.. అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువునైనా భారత్లోకి అనుమతించబోమని పేర్కొంది. ప్రస్తుతం రవాణా మార్గంలో ఉన్న సరుకులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని నోటిఫికేషన్లో వెల్లడించింది.
కాగా ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో.. ఇందుకు ప్రతీకారంగా భారత్ చర్యలు తీసుకుంటోంది. తొలుత సింధు జలాల ఒప్పందాన్ని.. పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడాలని ఆదేశాలు జారీ చేసింది. దాయాది దేశంపై ఆర్థికపరంగా ఒత్తిడి తెచ్చేలా చర్యలు తీసుకుంటోంది. వీటితోపాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో మళ్లీ పాక్ను చేర్చడానికి భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.