భారత్ సమాచార్.నెట్: ఉగ్రవాదానికి (Terrorism) వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రపంచమంతా కలిసి ముందుకు రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) శశిథరూర్ (Shashi Tharoor) పిలుపునిచ్చారు. పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచదేశాలకు తెలిపేందుకు భారత్ దౌత్య బృందం విదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శశిథరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలోనే న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ను సందర్శించింది. అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు శశిథరూర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న అతి పెద్ద సమస్య అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఆయన వివరించారు. ఆపరేషన్ సింధూర్తో పాక్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత్ నేలమట్టం చేసిందన్నారు. మేం ఉగ్రస్థావరాలపై దాడి చేస్తే, పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగింది. వాటిని సమర్థంగా భారత్ తిప్పికొట్టిందని తెలిపారు. ఉగ్రచర్యలను భారత్ సహించదని గట్టి సందేశం ఇచ్చామన్నారు. పాక్తో యుద్ధం చేయాలనేది భారత్ ఉద్దేశం కాదన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మాత్రమే పాక్పై దాడులు చేశామని తెలిపారు. పాక్తో యుద్ధం చేయాలని భారత్ కోరుకోవడం లేదన్నారు. దేశ ప్రజల రక్షణే ముఖ్యమని శశిథరూర్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సమస్యపై విభిన్న వర్గాలతో చర్చించడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశమన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది మేమే అంటూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి అభ్యర్థించినట్లు కూడా శశిథరూర్ పేర్కొన్నారు.
Share This Post