భారత్ సమాచార్.నెట్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగాక వరుసగా ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, బాంబు బెదిరింపులు రావడంతో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ ఫ్లైటుకు ప్రమాదం తప్పింది. పైలట్ మేడే సందేశం పంపడంతో సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడింది. గువాహటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగ్గా.. తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం గువాహటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం (6E6764)లో ఇంధనం తక్కువగా ఉందని పైలట్ గుర్తించాడు. దీంతో వెంటనే ఏటీసీకి మే డే సందేశం పంపారు. దీంతో అప్రమత్తమైన ఏటీసీ ఆన్ గ్రౌండ్ సిబ్బందిని అలర్ట్ చేసింది. వైద్య, అగ్నిమాపక సహాయక బృందాలు విమానం ల్యాండ్ అయ్యే ప్రదేశానికి చేరుకున్నాయి. గురువారం రాత్రి 8.20 గంటలకు ఆ విమానం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
ఇకపోతే మేడే కాల్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితి ఎదుర్కొంటున్నామన్న విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం పైలట్ దీన్ని వాడుతారు. దీని ద్వారా తాము ఆపదలో ఉన్నామని తక్షణ సాయం అవసరమని విజ్ఞప్తి చేసేందుకు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇండిగో విమానం పైలట్ దాన్ని వినియోగించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా లాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకునేది.