భారత్ సమాచార్, క్రీడలు : ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి రెండు టెస్టు మ్యాచుల్లోనూ అద్భుతమైన పేస్ బౌలింగ్ తో కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించిన విండీస్ యువ సంచలనం షమార్ జోసెఫ్ గురించి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా అన్ని జట్లూ చర్చించుకుంటున్నాయి. తమ జట్టులో ఇలాంటి బౌలర్ ఒకరు ఉండాలని కోరుకుంటున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ కూడా జోసెఫ్ లాంటి బౌలర్ ను కోరుకుంటున్నాయి. ఇందు కోసం ఆయా ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ విండిస్ బౌలింగ్ వీరుడి నైపుణ్యం గురించి ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు, మాజీలు కూడా ప్రశంసిస్తున్నారు. ఉపఖండం అయిన ఇండియా పిచ్ లలో కూడా షమార్ జోసెఫ్ బౌలింగ్ ప్రభావం చాలా ఎక్కవగా ఉండే అవకాశాలు ఉన్నట్టు అన్ని ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఐపీఎల్ మినీ వేలం పూర్తికావడం, దాదాపు ఈసారి ఐపీఎల్ లో ఆడే జట్లను ఖరారు చేసుకోవడం కూడా పూర్తయినా షమార్ జోసెఫ్ ను తమ జట్టులోకి ఎలాగైనా తీసుకోవాలని ఇప్పటికీ మూడు జట్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. కంగారూలను వణికించి పీడకలగా మారిపోయిన షమార్ జోసెఫ్ ను తమ జట్టులోకి వస్తే ఈసారి టోర్నీ తమదే అనే ధీమాలో కూడా ఉన్నాయి.
ఆర్సీబీ ఇప్పటికే విండీస్ పేసర్ అల్గారీ జోసెఫ్ ను తీసుకుంది. అయినా పేసర్లకు అనుకూలించే హోమ్ పిచ్ చిన్నస్వామి స్టేడియంలో షమార్ జోసెఫ్ వంటి పేసర్ అవసరమని భావిస్తోంది. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ను తెచ్చుకున్నా కోల్ కతా నైట్ రైడర్స్ షమార్ జోసెఫ్ తమ జట్టులో ఉండాలని అనుకుంటోంది. ఇప్పటికే ఉన్న స్టార్ బౌలర్లకు షమార్ తోడైతే తనకు తిరుగుండదు అని ఆ టీమ్ భావిస్తోంది.