భారత్ సమాచార్.నెట్: భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతలపై అమెరికా (America) జోక్యం చేసుకోబోదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) స్పష్టం చేశారు. ఇరు దేశాలు శాంతియుతంగా ఉండాలని ఆయన సూచించారు. ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంఘర్షణల నుంచి అమెరికా వైదొలగాలని భావిస్తోందని వాన్స్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ (President Trump) సైతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఫాక్స్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ”రెండు అణుశక్తి గల దేశాలు ఒకరినొకరు ఢీకొంటుండటాన్ని చూసి మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. ఈ ఉద్రిక్త పరిస్థితులు త్వరగా కుదురుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. భారత్కు పాకిస్థాన్పై కొన్ని కీలకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో న్యూఢిల్లీ తీసుకున్న చర్యలకు ఇస్లామాబాద్ స్పందిస్తోంది. ఇరుపక్షాలూ ఉద్రిక్తతను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మేము సూచించగలిగితే తప్ప, యుద్ధంలో ఏ రూపంలోనూ తలదూర్చే ఉద్దేశం మాకు లేదు. ఈ విషయంలో అమెరికా పాత్ర అసలు ఉండదు” అని వాన్స్ స్పష్టం చేశారు.
అలాగే, భారత్, పాకిస్థాన్ ఆయుధాలు వదలాలని అమెరికా చెబితే అది సమంజసం కాదని.. కానీ ఈ సమస్యకు సమాధానం అనేది ద్వైపాక్షిక చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ మార్గమే ప్రాంతీయ స్థాయిలో ముప్పును నివారించే ఉత్తమ మార్గం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన సుమారు 50 డ్రోన్లను భారత సైన్యం సమర్థంగా కూల్చివేసింది.