భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం గత 18నెలల కాలంలో 60,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, రెండులక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండులక్షల ఉద్యోగులు భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్నాకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరై మద్దతు తెలుపి మాట్లాడారు.
రేవంత్ రెడ్డి సీఎం కావడానికి నిరుద్యోగులే కారణం:
ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ 23 జిల్లాల్లో నూతనంగా 40 శాఖలు పెద్ద ఎత్తున ఏర్పరచారని, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు మండలాలకు మున్సిపాలిటీలకు పోస్టులు మంజూరు చేయలేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వ శాఖలలో పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. లేని పక్షంలో నిరుద్యోగులు పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి నిరుద్యోగులే కారణమని, నిరుద్యోగులను విస్మరించడం తగదని సూచించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పగిల్ల సతీష్, శివ, జిల్లాపల్లి అంజి, రాజేందర్, రాజు నేత, జనార్ధన్, ఇంద్ర, ఆస్మా, ప్రత్యూష, అర్జున్, హరికృష్ణ, ఆకాష్, శంకర్, వంశీ, అనంతయ్య మోడీ రాందేవ్, భాస్కర్ ప్రజాపతి, బాలయ్య, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.