భారత్ సమాచార్.నెట్: కరాచీ బేకరీ (Karachi Bakery). దేశ వ్యాప్తంగా ఈ బ్రాండ్కి మంచి క్రేజ్ ఉంది. వెజ్, నాన్ వెజ్ స్నాక్స్, నాణ్యమైన రుచికరమైన కుకీస్, కేకులు.. ఇతర చిరుతిళ్లకు కరాచీ బేకరి పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాలోనే (Telugu States) కాకుండా భారత్లోని అనేక నగరాల్లో (Different Cities) విజయవంతంగా కరాచీ బేకరీ తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో కరాచీ బేకరీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల వేళ.. కరాచీ బేకరీకి ‘కరాచీ’ పేరు ఉండటం ఇప్పుడు సమస్యగా మారింది. ‘కరాచీ’ పేరు ఉండటం వల్ల ఇది పాకిస్థాన్కు చెందినదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కరాచీ అనేది పాకిస్థాన్లోని ఒక ప్రముఖ నగరం కావడం గమనార్హం. ఈ అనుమానాలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తమ కస్టమర్లతో పాటు దేశప్రజలందరికీ తమ వ్యాపారం గురించి కరాచీ బేకరీ ఓనర్స్ క్లారిటీ ఇచ్చారు. తమ బ్రాండ్ పుట్టుక భారతదేశంలోనే జరిగిందని.. పూర్తి స్థాయిలో ఇది భారతీయ సంస్థే అని ఓనర్స్ పేర్కొన్నారు.
తమ బేకరీ మొదటిసారిగా 1953లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో స్థాపించినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కరాచీ అనే పేరు చరిత్ర సంబంధిత నేపథ్యంలో తీసుకున్నప్పటికీ, సంస్థకు పాకిస్తాన్తో ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. సంస్థ యజమానులు రాజేష్, హరీష్ రామ్నానీలు తెలిపిన వివరాల ప్రకారం.. వారి తాతగారు ఖాన్చంద్ రామ్నానీ భారతదేశ విభజన సమయంలో పాకిస్తాన్లోని కరాచీ నుండి భారత్కు వచ్చి.. హైదరాబాద్లో స్థిరపడి బేకరీను స్థాపించినట్లు చెప్పారు. ఆ ఊరి పేరు జ్ఞాపకార్థంగా “కరాచీ బేకరీ” అని పేరు పెట్టారని పేర్కొన్నారు.