భారత్ సమాచార్.నెట్: కర్ణాటక(Karnataka)లో బైక్ ట్యాక్సీల సేవలు (Bike Taxi Services) పూర్తిగా నిలిచిపోయాయి. ఇటీవల కర్ణాటక హైకోర్టు (Karnataka Highcourt) ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో (Rapido), ఉబర్ (Uber), ఓలా (Ola) వంటి ప్రముఖ సంస్థలు సోమవారం ఉదయం నుంచి తమ బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేశాయి. హైకోర్టు ఆదేశానుసారం తాము బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేశామని ర్యాపిడో సంస్థ ప్రకటించింది. అలాగే సేవల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.
అయితే ఉబర్ సంస్థ తన బైక్ ట్యాక్సీ సేవలను ‘ఉబర్ మోటో కొరియర్’ పేరిట కొనసాగించగా.. ఓలా యాప్ నుంచి బైక్ ట్యాక్సీ ఎంపికను పూర్తిగా తొలగించింది. వాస్తవానికి, మోటార్ వెహికల్స్ చట్టంలో బైక్ ట్యాక్సీలకు స్పష్టమైన ప్రస్తావన లేకపోవడంతో ఆ సేవలను నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టు సింగ్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ తీర్పును బైక్ ట్యాక్సీ సంస్థలు సవాలు చేయగా, డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పునే సమర్థించింది.
జూన్ 20లోగా రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది. దీంతో బైక్ ట్యాక్సీల సేవలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయాయి. బైక్, ట్యాక్సీ సేవలు నిలిచిపోవడంతో.. వేలాది మంది గిగ్ వర్కర్ల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని నమ్మ బైక్ ట్యాక్సీ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన అసోసియేషన్.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Share This Post