భారత్ సమాచార్.నెట్: జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Terror attack) మొత్తం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. బైసరన్ లోయలోని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను (Tourists) చుట్టిముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడిచేశారు. పవాల్గామ్ పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
మరోవైపు ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్లోని ప్రముఖ పత్రికలు ప్రత్యేక నిరసన తెలిపాయి. ‘గ్రేట్ కశ్మీర్’, ‘రైజింగ్ కశ్మీర్’, ‘కశ్మీర్ ఉజ్మా’, ‘అఫ్తాబ్’, ‘తైమీల్ ఇర్షద్’ వంటి ప్రముఖ పత్రికలు తమ సంప్రదాయ డిజైన్ను ప్రచురించకుండా నల్ల రంగుతో తమ మొదటి పేజీలను ముద్రించాయి. పేపర్ల ఫ్రంట్పేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నల్లగా ఉండగా, శీర్షికలు, సంపాదకీయాలు తెలుపు, ఎరుపు రంగులో ప్రింట్ అయ్యాయి. ఈ దాడికి నిరసనగా పిలుపునిచ్చిన బంద్కు అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు లభించింది.
కశ్మీర్ లోయలో గత 35 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో బంద్కు మద్దతు లభించిందని అధికారులు తెలిపారు. ప్రజలు, వ్యాపారవేత్తలు, పత్రికలు.. అన్నీ ఒకే గళంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ అభిమతాన్ని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని వెల్లడించింది.