భారత్ సమాచార్, కరీంనగర్ ; వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మార్క్ ప్రచారం మొదలుపెట్టారు. అధికార ప్రభుత్వం పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. గులాబీ శ్రేణులకు కాంగ్రెస్ వచ్చింది-కరువు తెచ్చింది అనే నినాదాన్ని ఇచ్చారు. నేడు కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్లో కేసీఆర్ పొలం బాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వ, అసమర్ధత కారణంగా నేడు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతన్నలతో నేరుగా మాట్లాడి పంటపొలాలకు ఉన్న నీటి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు అన్నదాతలు మాజీ సీఎం ముందు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. గత సంవత్సరం నీరు సంవృద్ధిగా ఉండేదని… ఇప్పుడు పొలమంతా ఎండిపోయింది వాపోయారు. ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరు బతుకుదురని చెప్పారు. అన్నదాతల సమస్యలపై స్పందించిన కేసీఆర్ రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని హామి ఇచ్చారు. రైతులు ధైర్యంగా ఉండి నీళ్లు కోసం పోరాటం చేయాలన్నారు.