భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున- తమిళ హీరో ధనుష్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. గత శుక్రవారం అంటే జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో కుబేర 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నాగార్జున, ధనుష్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రంలో ధనుష్ ‘దేవా’ అనే పాత్రలో, నాగార్జున ‘దీపక్’ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా, ఒక భిక్షగాడి పాత్రలో ధనుష్ కనబరిచిన అద్భుత నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తికి, వీధుల్లో బ్రతికే ఒక నిరుపేద వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా ప్రధాన కథాంశం. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. ఇకపోతే నాగార్జున కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. కొవిడ్ మహమ్మారి తర్వాత నుంచి ధనుష్ వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ధనుష్ నటించిన తిరు, సార్, రాయన్, కుబేర నాలుగు చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరడం విశేషం. కాగా కుబేర చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సొంతం చేసుకుంది.