భారత్ సమాచార్, దిల్లీ ; అద్వాని లేకుంటే అయోధ్య ఇలా ఉండేది కాదేమో..!
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందజేసింది. ఆయన పూర్తిపేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ 8న పాకిస్థాన్లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్య చదివారు. పాక్లోని హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య చదివారు. అనుకోకుండా 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వహించారు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్ కు వలస వచ్చారు. 1957లో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు.
బీజేపీ ఏర్పాటు..
1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని వాజ్ పేయితో కలిసి స్థాపించారు. 1996లో వాజ్ పేయి ప్రధాని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. ఆతర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. వాజ్పేయి ప్రధానిగా, అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉపప్రధానిగా విధులు నిర్వహించారు. 2004లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అద్వానీ.. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అద్వానీ.. 2019లో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
మలుపు తిప్పిన రథయాత్ర
వాస్తవానికి బీజేపీకి జోష్ తెచ్చింది. దేశంలో బీజేపీ అనే పార్టీ ఉందని అందరికీ తెలిసింది అద్వాని చేసిన రథయాత్రతోనే. అందుకే అద్వాని దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. బీజేపీ ఇప్పుడు బలంగా మారడానికి అనాడు ఆయన వేసిన పునాదులే కారణం. అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో రథయాత్ర చేశారు. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం నుంచి మహారాష్ట్ర, ఏపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఈ యాత్ర ప్రభంజనంలా సాగింది. లక్షలాది మంది కార్యకర్తల్లో ఉత్తేజం వచ్చింది. ఆ తర్వాతే బీజేపీ సిద్ధాంతాలు, భావాలు జనాల్లోకి ప్రబలంగా వెళ్లాయి. ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత, రామమందిర నిర్మాణం ఇలా అనేక సంఘటనలు చరిత్రలో లిఖితమయ్యాయి. ఈ చరిత్రకు ప్రధాన కారకుడు అద్వానినే కావడం విశేషం.