భారత్ సమాచార్, హైదరాబాద్ ;
కులవృత్తులపై ఆధారపడి జీవించే అన్ని వర్గాలకు ప్రజా ప్రభుత్వం కావలసిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అదే సమయంలో కులవృత్తిదారుల పిల్లలు ఉన్నచోటే ఆగిపోకుండా ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. చెట్టు ఎక్కినప్పుడు గీత వృత్తిదారులు ప్రమాదాలకు గురికాకూడదనే సదుద్దేశంతో రూపొందించిన ‘కాటమయ్య రక్షణ కవచం’ పంపిణీని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామం తాటివనంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ కవచం ధరించి చెట్లు ఎక్కిన గీత కార్మికులతో స్వయంగా మాట్లాడారు.
* ఈ సందర్బంగా చెట్లు పెంచాలన్న గౌడన్నల విన్నపం మేరకు కొత్తగా నిర్మించబోయే రహదారుల వెంబడి, వెలిసే రియల్ ఎస్టేట్ వెంచర్లలో తప్పనిసరిగా తాటిచెట్లు ఈత చెట్లు నాటాలనే నిబంధన తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గీత వృత్తిదారులకు మోపెడ్ వాహనాలు అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు.
* తాళ్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ. 7.90 కోట్ల ఎక్స్గ్రేషియా మొత్తాన్ని వెంటనే విడుదల చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.
* గీతకారులు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటి ఆరు పరికరాలతో కూడిన కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కిట్లు రూపొందించిన పర్వతాహకురాలు మలావత్ పూర్ణ బృందాన్ని అభినందించారు.
* రీజనల్ రింగ్ రోడ్డు వల్ల రంగారెడ్డి జిల్లాలోని రైతులకు మహర్దశ ఖాయమని, అందులో గౌడన్నలు కూడా ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపడుతున్నారన్న విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్పీకర్ పాల్గొన్నారు.