భారత్ సమాచార్.నెట్, కర్నూలు: కోసిగి తిమ్మప్ప, బసవన్న కొండల్లో చిరుతలు గత కొంతకాలంగా సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బసవన్న కొండ వెనుక ఉన్న ఎర్ర వంకలో చిరుతపులి కనిపించడంతో యువకులు దానిని వీడియో తీశారు. అనారోగ్య సమస్యతో పరిగెత్తడం చేతకాకపోవడంతో యువకులు, స్థానిక ప్రజలు దాన్ని వీడియోలు, ఫోటోలు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై హనుమంతరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని చిరుత వారి వద్దకు వెళ్లకుండా చెదరగొట్టారు.
రైతుపై పంజా విసిరిన చిరుత:
సమాచారం అందించి రెండు గంటలైనా అటవీ శాఖ అధికారులు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు వచ్చి చర్యలు తీసుకోవాల్సింది పోయి చిరుతను చూస్తూ నిలుచుండటంతో స్థానిక రైతులు ఏకమై చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. ఎలాగోలా శ్రమించి చిరుతను వలలో బంధించి అటవీశాఖ అధికారులకు పట్టించారు. చిరుతను బంధిస్తున్న సమయంలో చిరుత యువరైతు రైతు వీరేశ్పై పంజా విసరడంతో కాలుకు తీవ్ర గాయమైంది. జిల్లా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. చిరుతను తిరుపతి జూపార్కు తరలించినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.