Homemain slidesవరమహాలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం

వరమహాలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

కోరిన కోర్కెలు నెరవేర్చే శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరము నుంచి ఆవిర్భవించినది. వర అంటే శ్రేష్ఠమైనది అని అర్థం.వరలక్ష్మి అంటే శ్రేష్ఠమైన వరాలనిచ్చే చల్లని తల్లి. చంద్రుడు కూడా శ్రీ మహాలక్ష్మీ దేవితో పాటు క్షీర సాగరము నుంచే ఆవిర్భవించారు. చంద్రుడు శ్రీ మహాలక్ష్మీ దేవికి సోదరుడు. పౌర్ణమి ముందు చంద్రుడు సంపూర్ణమైన కాంతితో పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తుంటాడు. ఆ పూర్ణ చంద్రుని చూచి శ్రీ మహాలక్ష్మీ దేవి ఆ సమయమున ఎంతో సంతోషముగా ఉంటుంది . శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉండటానికి మరో ముఖ్య కారణం. శ్రావణ మాసం శ్రవణా నక్షత్రయుక్త మాసము. ఇది తన భర్త అయిన శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం. సాధారణంగా పౌర్ణమి శ్రవణా నక్షత్రం ఈ శ్రావణ మాసంలో ఇంచుమించుగా కలిసే వస్తాయి. అందువలన శ్రీ మహాలక్ష్మీ దేవి మరింత ప్రసన్నంగా ఉంటుంది. అలా శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉన్న పున్నమి ముందు శ్రావణ శుక్రవారం రోజున, ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తే, వారి సమస్త కోరికలు నేరవేరడమే కాకుండా, వారి సౌభాగ్యం నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో వర్ధిల్లుతుందని మన పెద్దలు శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతమును చేసుకోవాలని చెప్పారు.

వరలక్ష్మీవ్రతానికి తెలుగునాట ఎంతో ప్రాధాన్యం కూడా ఉంది. మహిళామణులు ప్రతి సంవత్సరం తప్పకుండా వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన మహిళలు పేరంటాళ్లకు వాయినం ఇస్తూ ‘కోరితి వరం’ అంటారు. వాయినం అందుకుంటున్న వారు ‘ఇస్తిని వరం’ అంటారు. ఆ తరువాత పూజ చేసుకున్నవారు ‘ఇస్తినమ్మ వాయినం’ అంటారు. వాయినాన్ని అందుకుని ముత్తయిదువ ‘పుచ్చుకొంటినమ్మ వాయినం’ అనాలి. ముత్తయిదువ రూపంలోనే లక్ష్మీదేవి మనపై వరాలను కురిపిస్తుందని నమ్ముతారు. వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి కాలనియమం లేదు. ఎన్ని సంవత్సరాలైనా ప్రతి శ్రావణమాసంలోనూ సాధ్యమైనప్పుడల్లా ఇతర మాసాల్లో కూడా చేసుకోవచ్చు. పెళ్లి తరువాత తొలిసారి వ్రతాన్ని ఆచరించే వారు అత్తవారింటనే చేసుకోవడం చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. సాధారణంగా ఉదయం వేళలోనే వ్రతం పూజ ఆచరిస్తారు. ముత్తయిదువలను పిలుచుకుని పేరంటాన్ని మాత్రం సాయంత్రం కూడా నిర్వహించుకోవచ్చు. వరలక్ష్మీవ్రతం పూజావిధానంలో లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజిస్తారు. కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. కలశంలో ఉంచే కొబ్బరికాయపై అమ్మవారి కన్ను, ముక్కు చెవుల వంటివి పిండితో తయారు చేసి అలంకరిస్తారు. కొంత మంది వెండి, బంగారు ప్రతిమలను ఉపయోగిస్తారు. ఆ అవకాశం లేనివారు కలశాన్ని పూజిస్తే చాలు. పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్లు, కొబ్బరికాయ, ఆవుపాలు, బెల్లంతో చేసిన పరమాన్నం, బూరెలు మొదలైన పిండివంటలు నివేదిస్తారు. కొందరు తొమ్మిదిరకాల పిండివంటలు చేస్తారు. చివరిగా వ్రతకథ చదువుకుంటారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత, విశిష్టత

RELATED ARTICLES

Most Popular

Recent Comments