భారత్ సమాచార్.నెట్, నెట్: వరంగల్ సిటీ: రాష్ట్రంలో గురువారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. కురిసిన భారీ వర్షానికి వరంగల్-ములుగు మధ్య జాతీయ రహదారి 163 పై ప్రధాన బ్రిడ్జి కుంగిపోయింది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లీంచారు.
కళ్ల ముందే కూలిన బ్రిడ్జి:
భారీ వర్షానికి ములుగు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, పొంగిపోర్లుతున్నాయి. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి కుంగిపోయింది. జాతీయ రహదారి 163 పై ఎస్సార్ఎస్పీ కెనాల్ వద్ద నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుంగింది. వంతెనకు ఒకవైపు ఒరగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. అయితే ఇసుక లారీల ఓవర్ లోడ్ వల్లే ఈ బ్రిడ్జి కుంగిందని స్థానికులు తెలిపారు. చర్ల, వాజేడు, వెంకటాపురం ఏటూరునాగరం మండలాల నుంచి వస్తున్న వేలాది ఇసుక లారీలు ఈ మార్గం మీదుగానే వరంగల్కు చేరుకుంటాయి. ప్రతిరోజు సుమారు మూడువేల ఇసుక లారీలు రావడానికి కేవలం ఇదొక్కటే ప్రధాన రహదారి ఉండడం, ఓవర్ లోడ్ ఇసుక లారీల వల్ల ప్రధాన రహదారిపై చాలా ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ప్రమాదం ఉందని చెప్పినా పట్టించుకోలేదు:
ఈ బ్రిడ్జికి ముప్పు పొంచి ఉందని గతంలో ఇంజనీరింగ్ అధికారులు కూడా హెచ్చరించినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం సంభవించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్ళ ముందే ఒక్కసారిగా ఆ బ్రిడ్జి ఒకవైపు కుంగిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. ప్రత్యామ్నాయ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత కూడిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సూచించారు.
మరిన్ని కథనాలు: