భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 (Miss World) అందాల పోటీలకు తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ (Hyderabad) వేదికగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కావడంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 120 దేశల సుందరీమణులు, ప్రముఖులు హాజరుకానున్నారు ఈ ఈవెంట్కు. ఈ వేడుక ద్వారా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం పర్యాటక ప్రాంతాల సందర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
గతేడాది 71వ ఎడిషన్ ముంబైలోనే జరగగా.. 72వ ఎడిషన్ హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. మే 10 నుంచి 31 తేదీ వరకు ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. పోటీలు ప్రారంభం కావడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉండడంతో వివిధ దేశాల సుదరీమణులు ఒక్కొక్కరిగా నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థ సీఈవో, ఛైర్పర్సన్ మిస్ జూలియా ఎవెలిన్ మోర్లీ, మిస్ వరల్డ్ ప్రతినిధి మిస్ కెర్రి హైదరాబాద్కు చేరుకోగా.. తాజాగా మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండియుజి, మిస్ కెనడా ఎమ్మా డయన్నా క్యాథరీన్ మోరిసన్లు చేరుకున్నారు.
హైదరాబాద్ చేరుకున్న ఈ అందాల భామలకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు పర్యాటకశాఖ అధికారులు. ఈ పోటీల్లో పాల్గొనే మిగిలిన బ్యూటీలు ఈ నెల 6వ తేదీ వరకు నగరానికి చేరుకోనున్నారు. మే 10 గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సంప్రదాయ నృత్యాలు, తెగల నృత్య ప్రదర్శనలతో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. మే 31న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రపంచం అంతా చూస్తున్న మిస్ వరల్డ్ వేదికపై ప్రపంచ సుందరి 2025 కిరీటాన్ని అందుకోబోయే ముద్దుగుమ్మ ఎవరనేది ఆసక్తిగా మారింది.