భారత్ సమాచార్.నెట్, తమిళనాడు: లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu) ఎం.కె. స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజగా డీలిమిటేషన్కు సంబంధించిన మెమో(Memo)ను సమర్పించేందుకు ప్రధాని మోదీ (PM Modi)ని స్టాలిన్ సమయం కోరారు. ఈ మేరకు మార్చి 27న ప్రధాని మోదీకి రాసిన లేఖను బుధవారం స్టాలిన్ ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు.
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగనుందని భావిస్తూ.. వివిధ రాజకీయ పార్టీల నేతలతో స్టాలిన్ ఇటీవల అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలోనే డీలిమిటేషన్పై పలు తీర్మనాలను ఆమోదించారు. ఈ క్రమంలోనే తాము సిద్ధం చేసిన మెమోను ప్రధానికి అందించేందుకు మోదీని సమయం కోరినట్లు స్టాలిన్ తెలిపారు. ఈ అంశంపై తమ వినతిని వ్యక్తం చేసే అవకాశాన్ని వెంటనే కల్పించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై తగిన స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇకపోతే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. దీని ప్రక్రియలో అనుసరించబోయే విధివిధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఇటీవల డీఎంకే నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో జనాభా ఆధారంగా పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామన్నారు. మరోవైపు.. ఎలాంటి చర్చలు చేపట్టకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్నారు.