భారత్ సమాచార్.నెట, తెలంగాణ: పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి కలగడం సహజమేనని.. ప్రస్తుతం తాను కూడా అసంతృప్తితోనే ఉన్నానని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు ప్రజల మధ్యే ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానన్నారు. ప్రజాజీవితానికి బ్రేక్ ఇవ్వాలన్న ఉద్దేశం లేదన్నారు. తెలంగాణ (Telangana)లో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
మరోవైపు తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలు, అలాగే ఒక రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో స్థానం లభించనున్నట్లు సమాచారం. అంటే మొత్తం నలుగురికి కేబినెట్లో చోటు కల్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఏఐసీసీ.. రాష్ట్ర కోర్ కమిటీ నుంచి వివరాలు తీసుకుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలను సేకరించింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీసీలో ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్కు రానుంది. ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ఆరు మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నాలుగైదు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మైనార్టీలకు ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు చోటు దక్కనుంది. ఇక వీటితోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నట్లు సమాచారం.