భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
టెట్, మెగా డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. హామీ మేర ఈ మొత్తం ప్రక్రియ ను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే నూతనంగా బీఈడీ, డిఈడి పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డిఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని టెట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీచేసింది ప్రభుత్వం.
టెట్, మెగా డిఎస్సీ పరీక్షలకి సన్నద్ధం అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు మంత్రి విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్ధం అవ్వడానికి
టెట్ పరీక్ష నిర్వహణ కు 90 రోజులు, మెగా డిఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయం ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. త్వరలోనే టెట్ మరియు డిఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది.
టెట్ నోటిఫికేషన్ సిలబస్ గురించి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలు ఇప్పటికే వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అయితే పాత సిలబస్ ఉంచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు పడకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిర్ణయించిన సిలబస్ నే ప్రస్తుత ఉపాధ్యాయ అర్హత పరీక్షకు కూడా నిర్ధారించటం జరిగిందని, దానినే వెబ్ సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియచేశారు.