భారత్ సమాచార్.నెట్: గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్లో (Ahmedabad) ఇటీవల ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే క్రాష్ అయ్యింది. ఈ దుర్ఘటనలో 270 మంది ప్రణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ ప్రజలన్ని తీవ్రంగా కల్చివేసింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని విమానాల భద్రతపై కేంద్రం దృష్టి సారించింది.
ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ సమీపంలో విమానాల రాకపోకలకు భవనాలు, చెట్లు ప్రధాన అడ్డంకిగా మారుతున్న కారణంగా.. వాటిని తొలగించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఉన్న నిర్మాణాలు లేదా చెట్లు విమాన ప్రయాణ భద్రతకు ప్రమాదంగా మారుతున్నట్టు గుర్తిస్తే, వాటిని తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అధికారులిచ్చే నోటీసు వచ్చిన తరువాత 60 రోజుల వ్యవధిలో, సంబంధిత భవన యజమానులు తమ భవనాల ఎత్తును తగ్గించాలి లేదా వాటిని పూర్తిగా కూల్చేయాలి.
భవన యజమానులు నోటీసుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. 18 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తమ సమాధానాన్ని అందించాల్సి ఉంటుంది. సరైన కారణాలుంటే మాత్రం మరో 60 రోజుల వరకు గడువు పొడిగించే అవకాశం కూడా ఉంది. కాగా, నోటీసు ఇచ్చిన తరువాత కూడా యజమానులు స్పందించకపోతే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు స్వయంగా వాటిని తొలగించే అధికారం కల్పించింది కేంద్రం. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మించిన భవనాలను విమాన రాకపోకలకు ముప్పుగా భావించి తక్షణమే కూల్చే హక్కు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.