భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack)కి ప్రతీకారంగా పాక్ (Pakistan)పై మెరుపు దాడికి (Attack) దిగింది భారత్ (India). అర్థరాత్రి 1.44 గంటల తర్వాత భారత్ త్రివిధ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా పాక్ పంజాబ్లోని మురీద్కే ప్రాంతం, పీఓకేలో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి.
భారత్ మిస్సైల్ దాడుల్లో దాదాపు 30 మందికి పైగా పాకిస్థాన్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఇక భారత్ జరిపిన దాడిని పాకిస్థాన్ అంగీకరించింది. తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని.. 8 మంది చనిపోయారని తెలిపింది. ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహమ్మద్ కేంద్రంగా ఉన్న బహావల్పూర్ సహా పంజాబ్ ప్రావిన్స్లోని ఐదు ప్రదేశాలు, పీఓకేలోని నాలుగు ప్రదేశాల్లో ఈ దాడులు జరిగాయి. మరోవైపు భారత్ సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోదీ రాత్రంతా సమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇకపోతే తాము దాడులు నిర్వహించింది ఉగ్రవాద స్థావరాలేనని.. పాకిస్థాన్ సైనిక స్థావరాలు కావని స్పష్టం చేసింది భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ. ఇక ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పలు ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు పేర్కొంది. అలాగే బార్డర్లోని పలు స్కూళ్లు మూసివేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఇతర ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా తమ విమానాల షెడ్యూల్లను రద్దు చేశాయి. బికనీర్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల వంటి అనేక నగరాలకు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.