భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ,సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో పాటు, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ , మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్ , రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్రావ్ బాగ్డే , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మంత్రులు విమర్శలు చేసుకున్నారు.
కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలి కానీ, ప్రజలు అసహ్యించుకునేలా ప్రజాప్రతినిధులు మాట్లాడకూడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా నాయకుల ప్రసంగాల్లో, భాషలో మార్పు రావాలని కోరారు. ఎన్నికలప్పుడు ఘర్షణ పడొచ్చు కానీ.. ఎన్నికలయ్యాక ప్రజల శ్రేయస్సే ముఖ్యమని అన్నారు.
ఇదే వేదికపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యాలకు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో నాయకుల భాష చాలా ముఖ్యం, మరొకరికి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది నిజం. అయితే మత విద్వేషాలు రెచ్చకొట్టేలా నాయకులు మాట్లాడకుండా స్వీయ నియంత్రణ పాటించాలన్నది కూడా చాలా అవసరం. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి ‘అలయ్ బలయ్’ గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాడు రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు, సకల జనులు ఉద్యమంలో కార్యోన్ముఖులు కావడానికి కూడా అలయ్ బలయ్ ఒక కారణమని గుర్తుచేశారు.
✅ గత 19 ఏండ్లుగా ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను పునరుద్దరించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
✅ తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలాగే అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకొస్తారు. దత్తాత్రేయ వారసురాలిగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న బండారు విజయలక్ష్మి కి అభినందనలు.
✅ ప్రజా ప్రభుత్వం, పార్టీ పెద్దలంతా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యత అని చాటి చెప్పాం.