భారత్ సమాచార్.నెట్: పద్మ పురస్కారాల ప్రధానోత్సవం (Padma Awards Event) రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లో అట్టహాసంగా జరిగింది. దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి.. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మవిభూషణ్ (Padma Vibhushan), పద్మభూషణ్ (Padma Bhushan), పద్మశ్రీ (Padma Shri) పురస్కారాలను ప్రకటించింది. వారిలో 71 మందికి తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేశారు. మిగిలిన వారికి త్వరలోనే అందజేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, కళా రంగంలో నటుడు బాలకృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ.. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ విశిష్ట పౌర పురస్కారాలను అందుకున్నారు. అలాగే సినీ నటుడు అజిత్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇతర ప్రముఖులు ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
ఇక ఈ పురస్కారాల ప్రధానోత్సవానికి బాలకృష్ణ సంప్రదాయ వస్త్రధారణ అయిన పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి నందమూరి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. నటుడిగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్గా అందిస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.