భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) అనంతరం భారత్ (India) ,పాక్ (Pakistan) మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి తర్వాత పాక్పై కేంద్రం కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాక్కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని కూడా కేంద్రం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సింధూ జలాల (Sindhu River) ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి (Pak Defence Minister) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
సింధు జలాలను అడ్డుకునేందుకు భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని ఓ ఇంటర్వ్యూలో ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ను మీడియా ప్రశ్నించగా.. అందుకు ఆయన బదులిచ్చారు. ఒకవేళ భారత్ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్ ధ్వంసం చేస్తుందని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి. మరోవైపు ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే సింధు జలాల నిలిపివేత.. పాక్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. వ్యవసాయం, తాగునీటి అవసరాలు, జలవిద్యుత్ ఉత్పత్తి కోసం పాక్ సింధు జలాలపై ఆధారపడి ఉంది. ఈ నది నుంచి నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడితే పాక్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇది దేశ ఆహార భద్రతకు, ప్రజల జీవనోపాధికి పెను ముప్పుగా మారుతుంది. అంతే కాదు పాక్లో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకం. నదీ జలాల కొరతతో పంటలు ఎండిపోయి ఆహార ఉత్పత్తి దెబ్బతింటుంది. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది.