భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిటి భారత సైన్యం (Indian Army) పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ (India) పాక్ (Pak) మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలోనే సైనిక రైళ్ల రాకపోకల కదలికలపై పాకిస్థాన్ నిఘా సంస్థలు దృష్టి సారించినట్లు సమాచారం అందడంతో భారతీయ రైల్వే శాఖ అప్రమత్తమైంది.
ఎలాంటి రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే బోర్డు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అడ్వైజరీ జారీ చేసింది. భారత సైనిక దళాలకు చెందిన ప్రత్యేక రైళ్ల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించవచ్చని రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రైల్వేలో మిలటరీ విభాగానికి తప్ప ఎలాంటి అనధికార వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ లీక్ చేసినా భద్రతా ఉల్లంఘన చర్యలుగానే భావిస్తామని రైల్వే శాఖ పేర్కొంది.
సైనిక రైళ్ల కదలికల సమాచారానికి ఉన్న ప్రాధాన్యం, తీవ్రత దృష్ట్యా దీనిపై రైల్వే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా మిలటరీ రైలు అనేది భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక విభాగం. సైనిక పరంగా వ్యూహాత్మక ప్రణాళికల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ సమయాల్లో సైనికులను భారీ యుద్ధ ట్యాంకులు, పరికరాలు, ఇతర వస్తువులు తరలించేందుకు ఈ మిలటరీ రైళ్లను వినియోగిస్తారు. రైల్వే బోర్డు ద్వారా కాకుండా నేరుగా సైనిక విభాగం ద్వారానే జరుగుతాయి.