భారత్ సమాాచార్, అంతర్జాతీయం : కేరళలో కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒక్క రోజే నాలుగు కేసులు నమోదయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది. అందుబాటులో ఉన్న ఆధారాల పరంగా చూస్తే జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదం లేదని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. దీంతో చావు కబురు చల్లగా చెప్పారని జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాగా మాతృ వంశం బీఏ.2.86లో భాగంగా జేఎన్.1ను గతంలో ‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించారు. మరోవైపు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా జేఎన్.1 వేరియంట్ పై ఆందోళనలు నెలకొన్నాయి. జేఎన్.1 వేరియెంట్ను మొదటిసారి అమెరికాలో సెప్టెంబర్ లో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయ్యాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ చెప్పింది.
దీంతో కొత్త వేరియంట్ పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేకున్నా.. అందరూ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే మహిళలు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు జాగ్రత్తగా ఉంటే మంచిదని అంటున్నారు.