భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ప్రజలు కలగన్న స్వప్నం సాకారం కాబోతోందని ప్రధాని మోదీ (Pm Modi) వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) పున:నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ ఇవాళా ఏపీకి వచ్చారు. పున:నిర్మాణ పనులు ప్రారంభం అనంతరం ప్రధాని మోదీ ప్రంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇది శుభ సంకేతమన్నారు ప్రధాని.
ఇది కేవలం శంకుస్థాపన కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు నిదర్శనం అని ప్రధాని అన్నారు. ఏపీ అంటే ఆధునిక ప్రదేశ్ అని పేర్కొన్నారు. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందని.. ఇప్పుడు కూడా అమరావతికి కేంద్రం అండగా ఉంటుందుని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ వికసిత ఏపీ కోసం కలగన్నారని.. మనందరం కలిసి ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలన్నారు. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు.
అమృత్ భారత్ స్కీమ్ కింద రైల్వేస్టేషన్లు ఆధునికరించామని ప్రధాని చెప్పారు. ఒకపప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ రూ.900 కోట్ల లోపే ఉండేదని.. ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9 వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చామన్నారు. ఏపికి గతంలో కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు. గత పదేళ్లో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జ్లు, అండర్పాస్లు నిర్మించినట్లు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని మోదీ అన్నారు.