Homebreaking updates newsPM Modi: ట్రంప్ ఆహ్వానాన్ని అందుకే తిరస్కరించా: ప్రధాని మోదీ 

PM Modi: ట్రంప్ ఆహ్వానాన్ని అందుకే తిరస్కరించా: ప్రధాని మోదీ 

భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా రావాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ తిరస్కరించారు. ట్రంప్ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారా ప్రధాని మోదీ వెల్లడించారు. చైతన్య మహాప్రభు తిరిగిన ప్రదేశానికి వెళ్లడం చాలా ముఖ్యమని ట్రంప్‌కు చెప్పినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో బీజేపీ తొలి ప్రభుత్వ వార్షికోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ సందర్భంగా ట్రంప్‌ ఆహ్వానంపై మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్‌ ఫోన్‌ చేశారు. వాషింగ్టన్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.. నేను చైతన్య మహాప్రభు తిరిగిన ప్రదేశానికి (ఒడిశా) వెళ్లడం నాకు చాలా ముఖ్యం.. అని నేను ట్రంప్‌తో చెప్పాను. ఆయన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించా’’అని పేర్కొన్నారు. ఇక్కడకు రావడం కోసమే అమెరికా సందర్శించాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ తిరస్కరించినట్లు చెప్పారు.
ఒడిశా బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందన్నారు ప్రధాని. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవం.. దీన్ని ప్రజాసేవ, ప్రజా విశ్వాసానికి అంకితం చేస్తున్నామని ప్రధాని తెలిపారు. అంతకుముందు ఒడిశా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మోదీ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. కాగా రెండు రోజుల క్రితం జీ 7 శిఖరాగ్ర సమావేశం కోసం కెనడాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES

Most Popular