భారత్ సమాచార్.నెట్: ఏపీలోని కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం వేదికగా 3.01లక్షల మందితో ఆర్కే బీచ్లో ఏకకాలంలో యోగాసనలు వేయడంతో యోగాంధ్ర 2025 కార్యక్రమం గిన్నిస్ రికార్డు వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుంకుంది. గతంలో గుజరాత్ పేరుపై ఉన్న ఈ రికార్డును ఆంధ్రప్రదేశ్ అధిగమించింది.
అయితే ఇదే సమయంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థుల చేసిన సూర్య నమస్కారాలకు గాను మరో గిన్నిస్ రికార్డు లభించింది. యోగాంధ్ర విజయవంతంపై ప్రధాని మోదీ స్పందించారు. యోగాను ఒక జీవన విధానంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. యోగా ప్రజలను మరోసారి ఏకతాటిపైకి తెచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఏపీ ప్రజలను ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం ఎంతోమందిని ఆరోగ్యకర జీవనానికి ప్రేరేపిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని.. ఈ కార్యక్రమం అనేక మందిని మంచి ఆరోగ్యం, శ్రేయస్సు దిశగా తీసుకెళ్తుందని ప్రధాని మోదీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.