భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని (Indian Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)కి మరో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి సైప్రస్ ప్రభుత్వం తమ దేశ అత్యుతన్న పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’ను ప్రదానం చేసింది. సైప్రస్ అధ్యక్షుడు ప్రదానం చేసిన పురస్కారంపై.. భారత్ ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. సైప్రస్ ప్రభుత్వం, ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ పురస్కారం రెండు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుధైవ కుటుంబకం భావనకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అలాగే, ఈ అవార్డును భారత్-సైప్రస్ మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఇరుదేశాల పరస్పర నిబద్ధత శాంతి, భద్రత, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శ్రేయస్సుపై మరింత బలపడుతుందని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో రెండు దేశాల క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇరు దేశాలు తమ దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా సురక్షితమైన, శాంతియుత వాతావరణాన్ని నిర్మించడానికి దోహద పడతాయన్నారు.
ఇకపోతే ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3 అనేది సైప్రస్ మొదటి అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ మకారియోస్ 3 పేరు మీద అందించే పురస్కారం. తమ దేశానికి `చేసిన ప్రతిభావంతమైన సేవకు గుర్తింపుగా దేశాధినేతలు, ముఖ్యమైన హోదా కలిగిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. కాగా, ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం సైప్రస్ చేరుకున్న వేళ.. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ స్వయంగా స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల విరామానంతరం భారత ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే తొలిసారి. సైప్రస్ పర్యటన అనంతరం మోదీ కెనడా వెళ్లి జీ7 సదస్సులో పాల్గొననున్నారు.