భారత్ సమాచార్.నెట్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రతరమైంది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై దాడులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు లోనైంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ షెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై ఇరువురు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. సమస్యలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతియుత పరిష్కారాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్రిక్తతలను తగ్గించడం ద్వారా మాత్రమే సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలమని ప్రధాని పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా దాడులతో ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకారదాడులు ప్రారంభించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైల్స్తో వరుస దాడులకు పాల్పడుతోంది. టెల్అవీవ్, జెరూసలేంపై క్షిపణులు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే టెల్ అవీవ్, జెరూసలేం ఇతర నగరాల్లో ఎమర్జెన్సీ సైరన్లు మోగాయి. దీంతో వీధుల్లో ఇజ్రాయెల్ పౌరులు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, బ్యాంకులను కూడా మూసివేసి అత్యవసర పరిస్థితి విధించినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు.