Homebreaking updates newsఅమరావతికి రానున్న ప్రధాని మోదీ

అమరావతికి రానున్న ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్, ఏపీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్‌ (AP)కు రానున్నారు. ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ప్రధాని మోదీ.. అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి దేశ వ్యాప్తంగా రాష్ట్రంపై దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్.

 

రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేసేలా ప్లాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 40 వేల కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లకు ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి ప్రజాధనం వినియోగించబోవడం లేదని స్పష్టం చేస్తూ.. అమరావతిని స్వయం పోషక ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, 2015 అక్టోబర్ 21న ప్రధాని మోదీ అమరావతికి తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది.

 

ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవల్పమెంట్ అథారిటీ) ఇప్పటికే ప్రణాళికను రూపొందించింది. మొత్తం రూ.62,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సీఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని భావిస్తోంది.

 

మరోవైపు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి పి. నారాయణ సహా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించి.. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగనున్నాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయి కానుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఈ పునఃప్రారంభం ద్వారా అమరావతి నిర్మాణానికి నూతనోత్సాహం తీసుకువస్తుందని, రాష్ట్ర ప్రజలకు మరింత ఆశాజనకమైన పరిస్థితులను కల్పిస్తుందని చెప్పవచ్చు.

 

RELATED ARTICLES

Most Popular