భారత్ సమాచార్.నెట్, మహారాష్ట్ర: మహారాష్ట్ర (Maharastra)లోని నాగ్పూర్ (Nagpur)లో ఉన్న ఆర్ఎస్ఎస్ (RSS) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం సందర్శించారు. ఆయన 11 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి రావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడి స్మృతి మందిర్ (Smriti Mandir)లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కె.బి. హెడ్గేవార్ (RSS Founder Dr. Hedgewar), మాధవ్ గోల్వాల్కర్(M. S. Golwalkar)కు నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat), కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా గోల్వాలకర్ జ్ఞాపకార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి ‘మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్’కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు.. లక్షల మందిని దేశం కోసం పని చేసేలా ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించిందన్నారు. ప్రజాసేవే దైవ సేవని ఆర్ఎస్ఎస్ నమ్మిందని, అన్నింటికన్నా దేశమే ముఖ్యమని ఆర్ఎస్ఎస్ బోధించిందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రంగాలు, ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకుల నిస్వార్థ సేవను ప్రధాని మోదీ కొనియాడారు. మహాకుంభ మేళాలో లక్షల సంఖ్యలో సేవ చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ప్రశంసించారు ప్రధాని.
ఇకపోతే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ అక్కడి విజిటర్స్ బుక్లో తన సందేశం రాశారు. స్మృతి మందిర్కు రావడంతో తన హృదయం ఉప్పొంగిందన్నారు. లక్షలాది స్వయంసేవకులకు ఇది శక్తి కేంద్రమన్నారు. దేశసేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్- ప్రేరణ ఇస్తుందని మోదీ పేర్కొన్నారు. మన కృషితో భారతమాత గౌరవాన్ని పెంపొందిద్దామని ప్రధాని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు.