భారత్ సమాచార్.నెట్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) తాజాగా బ్యాంకులకు కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. పదేళ్ల వయసు మించిన పిల్లలకు (Minors) బ్యాంకింగ్ స్వాతంత్య్రం కల్పిస్తూ ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై ఒకటో తేదీ నాటికి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దీంతో ఇప్పటివరకు తల్లిదండ్రులు మాత్రమే మైనర్లు ఖాతాలను నిర్వహించే నిబంధన మారిపోనుంది. సాధారణంగా 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లు బ్యాంకు ఖాతాలు ఉన్నా.. అవి తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ల ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి వచ్చేది.
అయితే ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో పదేళ్ల వయసు మించిన పిల్లలు ఇకపై సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను స్వయంగా నిర్వహించుకునే అవకాశం ఇచ్చింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు రిస్క్ మేనేజ్మెంట్ పాలసీని దృష్టిలో ఉంచుకొని సొంత నిబంధనలు ఫ్రేమ్ చేసుకోవచ్చు. 10 ఏళ్లు నిండిన తర్వాత పిల్లలు స్వతంత్రంగా ఈ ప్రక్రియ చేయవచ్చు. ఖాతా ఓపెన్ చేయాలనుకునే పిల్లవాడు/పిల్లకి 10 ఏళ్లు నిండితే, తల్లిదండ్రుల సాయం లేకుండానే అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, వారు తమ తల్లిని గార్జియన్గా చూపించి కూడా అకౌంట్ తెరవొచ్చు.
దీనికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు విధించినా ఖాతాదారుడికి ముందే తెలియజేయాల్సి ఉంటుంది. మైనర్లు మేజర్ అయ్యే వరకూ వారి నమూనా సంతకాన్ని బ్యాంకు రికార్డుల్లో భద్ర పరుస్తారు. 10 ఏళ్ల వయసులోపు ఉన్న వారు సైతం ఇప్పటికీ బ్యాంక్ ఖాతాను తెరవవచ్చు. అయితే, వారు లీగల్ గార్డియన్ పర్యవేక్షణలోనే ఖాతాను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. మైనర్లకు సంబంధించిన బ్యాంక్ ఖాతా, అది స్వతంత్రంగా నిర్వహిస్తున్నారా లేదా సంరక్షకుడి ద్వారా నిర్వహిస్తున్నా ఓవర్ డ్రా చేయడానికి అనుమతించబడదు. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఎల్లప్పుడూ క్రెడిట్ బ్యాలెన్స్ ఉండేలా చూసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.