భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా తుది విడత సీట్ల కేటాయింపును తాజాగా పూర్తి చేశారు. తుది విడత సీట్ల భర్తీ తర్వాత 18,951 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయినట్టు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ తెలిపారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 3వ తేదీ లోపు వారికి నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయడంతో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీలో జులై 19 నుండి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఏపీలో కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 6981 సీట్లు ఉండగా వాటిలో 6153 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. యూనివర్శిటీ కాలేజీల్లో 828 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 214 ప్రైవేటు కళాశాలల్లో 1,24,324 సీట్లు ఉండగా, 1,06, 324 భర్తీ అయ్యాయని 18 వేల సీట్లు మిగిలిపోయినట్టు సాంకేతిక విద్యా శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన 9 ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 7950 సీట్లు ఉండగా, 7826 సీట్లు భర్తీ చేసామని తెలిపారు. వీటిలో 126 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్శిటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో 25 శాతం ప్రభుత్వ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. మొత్తం 247 కళాశాలల్లో 1,39,254 సీట్లు ఉండగా, 1,20,303 సీట్లు భర్తీ అయ్యాయని, 18, 951 సీట్లు ఉన్నాయి.