భారత్ సమాచార్.నెట్: జాతీయ భద్రత సలహా బోర్డు సభ్యుడి (National Security Advisory Council Member)గా డీఆర్డీవో మాజీ ఛైర్మన్ (DRDO Former Chairman) జీ. సతీశ్ రెడ్డి (G. Satheesh Reddy) నియమితులయ్యారు. రెండు ఏళ్ల పాటు బోర్డు సభ్యుడిగా ఆయన కొనసాగనున్నారు. రా మాజీ చీఫ్ అలోక్ జోషీ (RAW Chief Alok Joshi) నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ సలహా బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. ప్రధాని నేతృత్వంలోని జాతీయ భద్రతా కౌన్సిల్కు ఈ బోర్డు పలు సూచనలు చేయనుంది. బోర్డులో ఇప్పటికే ఆరుగురిని నియమించిన కేంద్రం తాజాగా సతీశ్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రా మాజీ చీఫ్ అలోక్ జోషి నేతృత్వం వహిస్తున్న ఈ బోర్డులో మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, ఆర్మీ సథరన్ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మోంటీ ఖన్నా, విశ్రాంత ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ విదేశాంగ శాఖ అధికారి బి. వెంకటేశ్ వర్మ సభ్యులుగా ఉన్నారు. రక్షణ రంగ నిపుణుడు సతీశ్ రెడ్డికి చోటు కల్పించగా.. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేస్తున్నారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన సతీశ్రెడ్డి డీఆర్డీవో చైర్మన్గా, భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా సేవలందించారు. అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశారు సతీశ్ రెడ్డి. అలాగే హైదరాబాద్లోని జేఎన్యూ నుంచి ఎంఎస్ అండ్ పీహెచ్డీ పట్టా కూడా పొందారు. 1986లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL)లో చేరిన ఆయన ఆ తర్వాత రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) డైరెక్టర్గా పనిచేశారు.
ఇక్కడ ఐఆర్ సీకర్స్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ మాడ్యూల్స్ వంటి ఆవిష్కరణలకు ఆయన నాయకత్వం వహించారు. తొలుత నావిగేషన్ సైంటిస్ట్ మేనేజర్గా పనిచేసిన ఆయన 2014లో విశిష్ట శాస్త్రవేత్తగా పదోన్నతి పొందారు. 2015లో రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. భారతదేశ క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో సతీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక ఏపీ ప్రభుత్వం ఆయనను విమానయానం, రక్షణ రంగాల్లో గౌరవ సలహాదారు(రాష్ట్ర క్యాబినెట్ హోదా)గా ఈ ఏడాది మార్చి 19న నియమించింది.