భారత్ సమాచార్.నెట్: భారత్ వ్యోమగామి(Indian Astronaut) శుభాన్షు శుక్లా (Shubanshu Shukla) అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్ అయ్యింది. సాంకేతిక సమస్యతో (Technical Issue) వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో (ISRO) ప్రకటించింది. ఆక్సియం-4 మిషన్ (Axiom- 4 Mission) కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాన్షు శుక్లా.. జూన్ 19న రోదసియాత్రకు బయలుదేరనున్నట్లు ఇస్రో పేర్కొంది. ఈ మిషన్కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘ఆక్సియం’ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన మొదటి భారత వ్యోమగామిగానూ.. రోదసీలో అడుగుపెడుతోన్న రెండో భారతీయుడిగానూ శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. 40 ఏళ్ల కిందట అంటే 1984 లో భారత్కు చెందిన రాకేశ్ శర్మ.. రష్యాకు చెందిన సోయజ్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లగా.. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం శుభాన్షు శుక్లా రూపంలో భారత్కు దక్కింది.
నాసా సహకారంతో శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్లో శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. నిజానికి మే 29వ తేదీన ప్రయోగం జరగాల్సి ఉండగా, వాయిదా పడింది. మొదట ప్రయోగాన్ని ఈ నెల 8కి వాయిదా వేశారు. తర్వాత ఈ నెల 10, 11కు వాయిదా పడింది. ఆక్సియం-4 మిషన్కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజీ కావడంతో ఈ నెల 11న జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. లీకేజ్కు సంబంధించిన మరమ్మతులు పూర్తిచేసేందుకు మరింత సమయం పడుతుందని.. రాకెట్ లాంచింగ్ను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ఎక్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించింది.
Share This Post