Homebreaking updates newsShubhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా మొదటి సందేశం!

Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా మొదటి సందేశం!

భారత్ సమాచార్.నెట్: కోట్లాది మంది భారతీయుల ఆశయాలను మోసుకెళ్తూ భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా విజయవంతంగా రోదసిలోకి ప్రవేశించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి చేరుకున్నాడు. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఆక్సియం 4 మిషన్ అంతరిక్ష ప్రయాణం విజయవంతమైంది. బుధవారం మధ్యాహ్నం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ అందరిక్షంలోకి దూసుకెళ్లింది.

ఆకాశంలోకి దూసుకెళ్లిన 8 నిమిషాల్లోనే ఫాల్కన్ రాకెట్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేసింది. ఆక్సియం-4 మిషన్‌‌లో శుభాన్షు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌లో ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇక అంతరిక్ష నౌక 28 గంటల ప్రయాణం అనంతరం గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానం కానుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాన్షు శుక్లా నేతృత్వంలోని బృందం 14 రోజుల పాటు భారరహిత స్థితిలో పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది.
ఇకపోతే 41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి అంతరిక్షాన్ని చేరుకోవడంపై శుభాన్షు శుక్లా భావోద్వేగంతో భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూ కక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చూసినప్పుడు నాతో మీరు అందరూ ఉన్నారనిపిస్తోంది. ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు. భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది. జై హింద్‌, జై భారత్‌’ అని శుభాన్షు శుక్లా పేర్కొన్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments