భారత్ సమాచార్.నెట్: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసీ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఆక్సియం-4 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో శుభాన్షు శుక్లా రోదసీ యాత్రకు బయలుదేరనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం నాసా అధికారికంగా ప్రకటించింది. జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది.
నాసా తెలిపిన వివరాల ప్రకారం.. ఆక్సియం-4 మిషన్ ప్రయోగం జూన్ 25న మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) జరగనుంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ నింగిలోకి ఎగురనుంది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం) వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుందని నాసా తెలిపింది. ఈ మిషన్ కింద శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణిస్తారు. ఈ మిషన్కు శుభాన్షు శుక్లా పైలట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే శుభాన్షు శుక్లా రోదసి యాత్ర ఇప్పటివరకు ఐదు సార్లు వాయిదా పడింది. ఇది మే 29న జరగాల్సి ఉండగా.. ఆ తర్వాత జూన్ 8కి వాయిదా పడింది. మళ్లీ జూన్ 10, జూన్ 11, జూన్ 19 తేదీలకు మారింది. ఇకపోతే అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘ఆక్సియం స్పేస్’ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఈ ప్రయోగంలో భాగస్వామ్యం అవుతున్నారు. కాగా 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉండనున్న వ్యోమగాములు.. ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అంతరిక్షం నుంచి ముచ్చటించనున్నారు.